హైదరాబాద్: మహాకూటమి ధర్మాన్ని మరిచి టీఅర్ ఎస్ నేత కెసీఅర్ కేంద్రంలో ఎన్డీయేతో జత కట్టడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఆశ్చర్యం కలిగించినట్టు లేదు. దీనికి సంబంధించి కెసీఅర్ కు చంద్రబాబు నాయుడికి రహస్య అవగాహన ఉందేమోనన్న అనుమానం లెఫ్ట్ నేతలకు పట్టుకుంది. ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్డీయేకు మొగ్గు కన్పిస్తే చంద్రబాబు నాయుడు కూడా లెఫ్ట్ ను ముంచేసి అక్కడ చేరిపోతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీయేకు టీఅర్ ఎస్ మద్దతే కాకుండా తమ మిత్రపక్షాల మద్దతు కూడా అందేలా చూస్తామని నిన్న కెసీఅర్ లూధియానా ర్యాలీలో ప్రకటించడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.
కెసీఅర్ ను ముందు పంపించి తాను ఫలితాల తర్వాత వస్తానని అద్వానీతో చంద్రబాబు నాయుడు ముందే మాట్లాడుకుని ఉంటారని వామపక్షాలు భావిస్తున్నాయి. చంద్రబాబు తమ కూటమి నుంచి వెళ్ళిపోతే జాతీయ స్ధాయిలో నవ్వుల పాలవుతామని లెఫ్ట్ నాయకులు భయపడుతున్నారు. అందువల్ల ఇక్కడ బాబుకు మద్దతు ఇచ్చే విషయంలో ఇప్పటి నుంచే అనేక షరతులు పెడుతూ బాబును ఇరుకునపెట్టాలని ఆ పార్టీలు యోచిస్తున్నాయి. బాబు ఎన్డీయేలోకి చేరకుండా వ్యూహ రచన చేస్తున్నాయి. ఎలాగైనా ఎన్డీయేను అధికారంలోకి రానివ్వకుండా చూడడం ఇప్పుడు వామపక్షాల ముందున్న లక్ష్యం. అందుకోసం తాత్కాలికంగా కాంగ్రెస్ తో చేతులు కలపడానికి కూడా వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. బలమైన తృతీయ కూటమి ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో 16 తర్వాత ఏంచేయాలో ఇప్పటి నుంచే వామ పక్షాలు గతి తార్కిక భౌతిక వాదం పంథాలో ఆలోచబ చేస్తున్నాయి.
కెసీఅర్ ఎంత సులభంగా మహాకూటమిని విడిచి ఎన్డీయే కూటమిలో చేరారో అంతే వేగంగా చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నందున దానిని ఎలా అరికట్టాలనే విషయంలో ఆ పార్టీల జాతీయ నేతలు సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. బిజెపీతో కలిసే ఏ పార్టీతోనూ తాము రాష్ట్రంలో కేంద్రంలో కలిసే ప్రసక్తే లేదని స్పష్టమైన ప్రకటనలు చేయడం ద్వారా చంద్రబాబుకు హెచ్చరికలు చేయాలని భావిస్తున్నారు. చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు ఒక తానులో ముక్కలని, అవకాశవాదులని లెఫ్ట్ నాయకులకు బాగా తెలుసు. రాష్ట్రంలో మహాకూటమికి కూడా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేనందువల్ల చంద్రబాబు నాయుడు ఫలితాల అనంతరం కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేసే అవకాశముందని అంటున్నారు. ప్రజారాజ్యం మద్దతు సంపాదించడానికి ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే మౌలిక కసరత్తు జరిగిందని చెబుతున్నారు.
మరిన్ని వివరములు:
Related news