clear
clear
clear
clear
x

వైయస్ ది హత్యా?

  మంగళవారం, అక్టోబర్ 20, 2009, 9:43[IST]
YS Rajasekhar Reddy
Vote this article
Up  
Down  


హైదరాబాద్: డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై అలస్యంగా పెను దుమారం చెలరేగుతోంది. వైయస్ ది ప్రమాదం వల్ల జరిగిన మరణం కాదని, దీని వెనుక కుట్ర ఉండవచ్చన్న అనుమానాలను వైయస్ సొంత పత్రిక "సాక్షి" బయటపెట్టింది. కావాలనే బ్లాక్ బాక్స్ రహస్యాలను మరుగు పరుస్తున్నారని ఈ పత్రిక రాసింది. వైయస్ మరణించిన తర్వాత 45 రోజులకు ఈ విషయాలను ఆ పత్రిక లేవనెత్తడం అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇవన్నీ బయటికి వచ్చి ఉండేవి కావా? జగన్ కు ఆ పదవి ఇవ్వకపోవడం వల్లనే ఇవన్నీ బయటికి వస్తున్నాయా?

సాక్షి లేవనెత్తిన ప్రశ్నలివి:

బెల్‌-430 హెలికాప్టర్‌ను ఆగస్టు 28న పరీక్షించామని చెబుతున్నారు. ఆ తర్వాత మూడు రోజులు ఖాళీగా ఉన్నప్పుడు దాని పరిస్థితి ఏమిటి?
ఆ మూడు రోజులు హెలికాప్టర్‌ ఎక్కడుంది? దాన్ని ఎవరైనా చూసి వెళ్లారా?
దానికి సంబంధించిన ఇంజనీర్లు చివరగా దాన్ని ఎప్పుడు పరిశీలించారు?
ఆగస్టు 31న ముఖ్యమంత్రి పర్యటన వివరాలు అందిన వెంటనే బెల్‌-430 వాడాలన్న నిర్ణయానికి వచ్చారా?
ఇస్రో సూచించిన మేరకు బెల్‌-430లో ఎమర్జెన్సీ లొకేటర్‌ ట్రాన్స్‌మీటర్‌ (ఈఎల్‌టీ) సామర్థ్యం పెంచాల్సిన బాధ్యత ఎవరిది?
ఆగస్టు 26న సర్వీసింగ్‌కు పంపిన అగస్టా-139 రావడం ఆలస్యమవుతుందని సర్వీసింగ్‌ సెంటర్‌ నుంచి సమాచారం ఏదైనా ఉందా?
బెల్‌-430 హెలికాప్టర్‌కు ఎయిర్‌ వర్తీనెస్‌ ఉందా?
అసలు ముఖ్యమంత్రి వైయస్ పర్యటన ఎప్పుడు ఖరారైంది?
సివిల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌కు ఎప్పుడు సమాచారం ఇచ్చారు?
వాతావరణ నివేదికలో ఏముంది? ఆ సమాచారాన్ని అడిషనల్‌ డీజీ ఇంటెలిజెన్స్‌కు ఇచ్చారా?
హెలికాప్టర్‌లో ఉన్న వాతావరణ రాడార్‌ సిస్టమ్‌ పనిచేయలేదా?
అత్యంత పటిష్టవంతంగా ఉండే బ్లాక్‌బాక్స్‌ (కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ , ఫ్లయిట్‌ డాటా రికార్డర్‌) నిజంగానే దెబ్బతిన్నదా?
ఏవియేషన్‌ కార్పొరేషన్‌, పోలీసులు గుర్తించిన క్రాష్‌సైట్‌ కో-ఆర్డినేట్స్‌ మధ్య వ్యత్యాసం ఉందా?
హైదరాబాద్‌ నుంచి చిత్తూరుకు చాలా దూరం (470 కిలోమీటర్ల ఏరియల్‌ డిస్టెన్స్‌) వెళ్లాల్సి వచ్చినప్పుడు హెలికాప్టర్‌ ప్రయాణం మంచిది కాదని వీవీఐపీకి అధికారులు ఎందుకు సూచించలేదు?
వైయస్ మృతిని మిస్టరీగా మార్చింది సాక్షి. అయితే ఎవరు ఈ కుట్రకు పాల్పడి ఉంటారో మాత్రం సాక్షి రాయడం లేదు.

ప్రమాదంపై దర్యాప్తును పోలీసులు సరిగా చేయలేదని కూడా సాక్షి మరో కథనంగా ప్రచురించింది. ప్రమాద స్ధలంలో వైయస్ వాచ్ ని స్ధానికులు దొంగిలించుకు పోయారని తెలిపింది.

ఆ వివరాలివి:
ఘటనా స్థలాన్ని గుర్తించిన తర్వాత పోలీసులు అనుమానాస్పద మృతి కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనుమానాస్పద మృతి అన్నప్పుడు ఘటనాస్థలిలో లభించే ప్రతి చిన్న వస్తువు దర్యాప్తు సందర్భంగా కీలక ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ప్రతి ఒక్క శకలాన్నీ, వస్తువునూ పక్కాగా కాపుకాసి పరిరక్షించాల్సి ఉంటుంది. దీన్నే పోలీసు పరిభాషలో "క్రైమ్‌ సీన్‌ మేనేజ్‌మెంట్‌' అంటారు. అయితే పావురాల గుట్టపై ఈ పరిరక్షణ మచ్చుకైనా కనిపించలేదు.

హెలికాప్టర్‌ విడి భాగాలు, వాటి ప్రాముఖ్యం, సేకరించాల్సిన విధానం, భద్రపరిచే తీరు తదితర అంశాలపై డీజీసీఏ మినహా మిగిలిన సంస్థలకు అవగాహన లేకపోవడంతో మరికొన్ని సమస్యలను తెచ్చిపెట్టింది. దీంతో కర్నూలు జిల్లా పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాదాల్లో స్పందించే తీరులోనే వైయస్ హెలికాప్టర్‌ ఉదంతంలోనూ స్పందించారు. ఈ క్రైమ్‌సీన్‌ మేనేజ్‌మెంట్‌ విషయం ఇలా ఉండగా...మృతుల శరీరభాగాల మొదలు శకలాలు, కీలక ఆధారాలు తదితరాల సేకరణలోనూ నిలువెత్తు నిర్లక్ష్యం కనిపించింది. పావురాలగుట్టను సందర్శించిన స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్‌, సీఐడీ, సీబీఐ బృందాలు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించలేదని స్పష్టంగా తెలుస్తోంది.

పావురాలగుట్టను సందర్శించిన ఒక్కో బృందం ఒక్కోరోజు కొన్ని శకలాలను, వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకోవడం దర్యాప్తు సంస్థల అలసత్వం స్పష్టంగా కనబడుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణానికి సంబంధించిన ఆధారాల సేకరణలో ఇంతటి అలసత్వం దేనికి సంకేతం? ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించిన విధానాన్ని పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలు తలెత్తక మానవు.

సెప్టెంబరు 3వ తేదీ ఉదయం 11.00 గంటలకు అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో పావురాలగుట్టపైకి చేరారు. అక్కడికి చేరుకున్న తక్షణం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోలేదు. కేవలం మరణించిన వారి శరీర భాగాలను తరలించడంతో పని పూర్తయిందనిపించారు.

ఆ రోజు గుట్టపైకి వెళ్లిన పార్నపల్లెకు చెందిన జనార్దన్‌రెడ్డి, రామాంజనేయులు తదితర స్థానికులు మృతదేహాల తరలింపులో భద్రతా సిబ్బందికి సహాయపడ్డారు. అయితే వారిలో ఒకరు తిరిగి వెళుతూ ఘటనాస్థలంలో దొరికిన వైయస్ వాచీ పట్టుకుపోయారు. దాన్ని మూడు రోజుల (6న) తర్వాతకాని పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారు.

ఐదు మృతదేహాలను 3వ తేదీనే కర్నూలుకు తరలించారు. అయితే మృతదేహాలకు సంబంధించిన అనేక శరీర భాగాలను ఐదో తేదీన కూడా సేకరించడం గమనార్హం.
ఐదో తేదీ రాత్రి వరకు వైయస్కు చెందిన దొడ్డు బియ్యంతో తయారు చేసిన కలర్‌ రైస్‌ప్యాకెట్‌, చెప్పులు, పంచె, షేవింగ్‌ కిట్‌, పుస్తకాలు, సూట్‌కేస్‌ పావురాలగుట్టపైనే పడి ఉన్నాయి.
సీఎంవో కార్యాలయం ముఖ్యకార్యదర్శి సంతకంతో ఉన్న ఓ ముఖ్యకాగితం, బ్యాటరీలను మూడు రోజులు ఆలస్యంగా ఆరో తేదీన సేకరించిన స్థానిక పోలీసులు ఆ తర్వాత జిల్లా ఎస్పీకి అందించారు.
వైయస్, వెస్లీ, సుబ్రహ్మణ్యం సెల్‌ఫోన్లను కర్నూలు జిల్లా అధికారులు ఘటనా స్థలం నుంచి ఐదు రోజులు ఆలస్యంగా ఎనిమిదో తేదీన స్వాధీనం చేసుకున్నారు.
ఉదంతం చోటు చేసుకున్న పది రోజుల తర్వాత 13వ తేదీన పావురాలగుట్టకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందం ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ డాటా కార్డ్‌, వెస్లీకి చెందిన గుర్తింపుకార్డు స్వాధీనం చేసుకున్నారు.
సీబీఐ బృందం 14వ తేదీన మరోసారి పావురాలగుట్టకు వెళ్లినప్పుడు సిమ్‌కార్డు, మరో వాచీ, ఐదు తూటాలు (బుల్లెట్స్‌) స్వాధీనం చేసుకుంది. మరో పది తూటాలు ఇప్పటికీ ఆచూకీ లేవు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: రామాంజనేయులు
తేదీ: 03 Nov 2009 5:39 pm
ఈ పేపరు అన్ని వ్యర్థపు వ్రాతలు వ్రాస్తుంది ఈ పేపరు చదవడమే సుద్ధ దండగ

పోస్ట్ చేసినవారు: PPPP
తేదీ: 22 Oct 2009 4:12 am
APlo lucchalu-peellaniki-kodaliki teda teliyani vedavalu paper petti tappudu ratalu raastunnaru

[ Post Comments ]
  Other News
  Videos