దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి మరో యత్నం కూడా సాగుతున్నట్లు సమాచారం. లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే చాలు తామేమిటో నిరూపిస్తామనే ఉద్దేశంతోనే కాంగ్రెసు శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ శాసనసభ్యులు జగన్ కు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో బయట పడడానికి అదొకటే మార్గమని అంటున్నారు. పార్టీ శాసనసభ్యుల సంతకాలను తీసుకుని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి పయనం కానున్నట్లు తెలుస్తోంది. శాసనసభ్యుల మనోగతాన్ని అధిష్టాన వర్గానికి వినిపించి సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసేలా చూడడమే ఆయన కర్తవ్యంగా చెబుతున్నారు.
మల్లు భట్టి విక్రమార్క మొదటి నుంచీ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి పూర్తి అనుయాయిగా పనిచేస్తున్నారు. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా కూడా మల్లు భట్టి విక్రమార్క చేతనే వైయస్ రాజశేఖర రెడ్డి చక్రం తిప్పించారు. అభివృద్ధి తెలంగాణ కావాలంటూ తెలంగాణ కాంగ్రెసు నాయకులను ఢిల్లీకి తీసికెళ్లింది ఆయనే. వైయస్ మరణం తర్వాత జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ శాసనసభ్యులను, మంత్రులను కూడగట్టి టీవీ చానెళ్ల ముందు వాదనలు వినిపించింది కూడా ఆయనే అనే ప్రచారం సాగుతోంది.
జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే తిరుగుబాటు జెండాను ఎగురవేస్తారా అనే అనుమానం కూడా అధిష్ఠాన వర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ శాసనసభ్యులు అధిష్ఠాన వర్గంపై తిరుగుబాటు ప్రకటిస్తే కష్టాలు తప్పవు. ఈ మధ్యనే మరో ప్రచారం కూడా ఊపందుకుంది. చిరంజీవి మద్దతుతోనో, కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల మద్దతుతోనో పార్టీ అధిష్టాన వర్గం అంగీకరించకపోయినా వైయస్ జగన్ ముఖ్యమంత్రిని చేయాలనే లాబీయింగ్ జరుగుతోందనేది ఆ ప్రచారం సారాంశం.