హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ టికెట్లు పందేరం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్లు ఇచ్చే అధికారం తనకు తప్ప మరెవరికీ లేదని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. దీనితో టికెట్లను ఆశించేవారు సూట్ కేసులను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల సందర్భంగా అప్పటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్ విజయవాడకు చెందిన ఒక మైనారీటీ నాయకుడి నుంచి అసెంబ్లీ టికెట్ కోసం పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకున్నట్టు బయటికి వచ్చింది. ఆ విషయాన్ని ఆ మైనారిటీ నాయకుడు స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నాయి. కాంగ్రెస్ టికెట్లు అభ్యర్ధిస్తున్న వారి నుంచి కనీసం పాతిక లక్షలను డిఎస్ మనుషులు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా డిఎస్ ఉన్నందువల్ల, ఆయనకు అడ్డుపడకూడదని రోశయ్య నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగన్ కు రోశయ్యకు మధ్య జరుగుతున్న సమరంలో డిఎస్ తదితర సీనియర్లు పరోక్షంగా రోశయ్యకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
డి శ్రీనివాస్ మొదటి నుంచి కాంగ్రెస్ హైకమాండ్ కు వీర విధేయుడు. గత అసెంభ్లీ ఎన్నికల్లో డిఎస్ గెలిచి ఉంటే రోశయ్య స్ధానంలో ఆయనే ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఆ బాధను దిగమింగుకుని డిఎస్ ఇప్పుడు రోశయ్యకు సహకరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు శ్రీనివాస్ కు, రోశయ్యకు సవాలు వంటివి. జగన్ ప్రచారానికి వస్తారంటూ దానం నాగేందర్ వంటి వారు ఇప్పటికే బాకా ఊదుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు స్టార్ క్యాంపైనర్లు కాంగ్రెస్ కు లేరు. తెలుగుదేశం పార్టీకి నందమూరి అందగాళ్ళు ప్రచారం చేస్తారు. ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి ఒక్కరు చాలు. కాంగ్రెస్ తరఫున జయసుధను ప్రచారానికి దింపాలన్న ఆలోచన రోశయ్యకున్నా ఆమెను జగన్ నిలువరించవచ్చన్న అభిప్రాయం ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వైఎస్ ప్రారంభించిన పథకాలే ఆదుకోవాలి.
మరిన్ని వివరములు:
శ్రీనివాస్
కాంగ్రెస్
గ్రేటర్ హైదరాబాద్
సంబంధిత వార్తలు