హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తుపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇంకా ఆశలు వదులుకోలేదని తెలుస్తోంది. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శిబిరం వ్యాఖ్యలతో, వ్యతిరేకతతో పొత్తుపై ప్రజారాజ్యం, కాంగ్రెసుల మధ్య పొత్తుల చర్చలకు బ్రేక్ పడింది. జగన్ వర్గం ఒత్తిడితో ప్రస్తుతానికి ప్రజారాజ్యంతో పొత్తు లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రకటించాల్సి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో పొత్తు ఖరారు చేసుకుని తర్వాతి రాజకీయాలకు మార్గం వేసుకోవాలని జగన్ వ్యతిరేక వర్గం ఆలోచిస్తోందని, జగన్ పై కుట్రలో భాగంగానే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని జగన్ వర్గం ఆలోచన. దాంతో ప్రజారాజ్యం పార్టీతో పొత్తును జగన్ వర్గం వ్యతిరేకించింది.
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావాలని జగన్ వర్గం ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇప్పటికిప్పుడు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. విలీనానికి తక్షణమే ప్రజారాజ్యం అంగీకరించదనే ఉద్దేశంతోనే జగన్ వర్గం ఆ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. తాము విలీనానికి సిద్ధంగా లేమని, పొత్తుకు మాత్రమే సిద్ధంగా ఉన్నామని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య తాజాగా చెప్పారు. కాగా, వీరప్ప మొయిలీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. వీరప్ప మొయిలీ వచ్చిన తర్వాత తిరిగి పొత్తులపై చర్చలు ప్రారంభం కావచ్చునని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి, అధిష్టానం అనుమతి లేకుండా పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీతో చర్చలు ప్రారంభిస్తారని అనుకోవడానికి లేదు. అయితే, జగన్ వర్గం ఒత్తిడితో వ్యూహాత్మకంగా పార్టీ అధిష్టానం ప్రజారాజ్యంతో పొత్తుపై కాస్తా వెనకంజ వేసినట్లు భావిస్తున్నారు. సమయం తీసుకోవడానికి మాత్రమే పొత్తు ప్రస్తుతానికి ఉండదని మొయిలీ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. దీంతో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుతో పొత్తు కుదురుతుందని ఇంకా ఆశతోనే ఉంది.
మరిన్ని వివరములు:
చిరంజీవి
ప్రజారాజ్యం
కాంగ్రెసు
సంబంధిత వార్తలు