న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రస్తుతానికి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో పొత్తు లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. పొత్తుపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ విషయం చర్చించాల్సింది కూడా కాదని ఆయన అన్నారు. పొత్తు చర్చలపై తానేమీ వ్యాఖ్యానించబోనని ఆయన అన్నారు.
కాగా, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య సోమవారం సాయంత్రం హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. తాము పొత్తుపై తుది నిర్ణయం తీసుకోలేదని ప్రజారాజ్యం పార్టీ మరో నేత కోటగిరి విద్యాధర రావు చెప్పారు. అయితే తాము పొత్తుకు ఆసక్తితో ఉన్నామని ఆయన చెప్పారు. పొత్తుపై విమర్సలు కాంగ్రెసు పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ తో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఇమేజ్ ను పోల్చలేమని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయవాడలో అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఒంటరిగా పోటీ చేసి 125 స్థానాల్లో గెలుస్తుందని, మేయర్ పదవిని కైవసం చేసుకుంటుందని ఆమె అన్నారు.
మరిన్ని వివరములు:
కాంగ్రెసు
వీరప్ప మొయిలీ
ప్రజారాజ్యం
సంబంధిత వార్తలు