హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ ఏదో మాట్లాడితే తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనకు సభ్యత, పౌరుషం ఉన్నాయని, కెసిఆర్ మాదిరిగా అసభ్యంగా మాట్లాడలేనని ఆయన అన్నారు. కెసిఆర్ భాషను, తీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు. మాటల యుద్ధంలో కెసిఆర్ లాగా తాను మాట్లాడలేనని, తనకు ప్రజా సమస్యలే ముఖ్యమని ఆయన అన్నారు.
బాధ్యతలు విస్మరిస్తున్న మంత్రులను నియంత్రించడంలో ముఖ్యమంత్రి రోశయ్య విఫలమవుతున్నారని ఆయన అన్నారు. ప్రజల డబ్బుతో ఊరేగే బదులు మంత్రులు శానిటేషన్ పై దృష్టి పెడితే మంచిదని ఆయన అన్నారు. బిసీలను ప్రభుత్వం రకరకాలుగా అణగదొక్కుతోందని ఆయన విమర్శించారు. జీవో 3, జీవో 49లను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము బిసీ రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ కు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. గతంలో కూడా కాంగ్రెసు ప్రభుత్వ అవినీతి చర్యలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారానికి తాము అందరితో కలిసి పోరాటం చేశామని ఆయన చెప్పారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి లతో పోరాడామని, ఇప్పుడు రోశయ్యతో కూడా పోరాడుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసులో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, తాము మాట్లాడేది ఏమీ లేదని ఆయన అన్నారు.
మరిన్ని వివరములు:
చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం
కె చంద్రశేఖర రావు
సంబంధిత వార్తలు