కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా సంక్రాయిల్ పోలీసు స్టేషను నుంచి అపహరణకు గురైన దాదాపు 50 గంటల తర్వాత పోలీసు అధికారి అతీంద్రనాథ్ దత్తా ఇల్లు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున ఆయన ఉత్తర కోల్ కత్తాలోని తన నివాసానికి చేరుకున్నారు. మావోయిస్టులు దత్తాను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న 14 మంది గిరిజన మహిళలను పశ్చిమ బెంగాల్ విడుదల చేయడంతో మావోయిస్టులు దత్తాను వదిలేశారు.
రాష్ట్ర పోలీసు శాఖ కమెండోలు వెంట రాగా దత్తా శుక్రవారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో ఆయన తన ఇంటికి చేరుకున్నారు. తల్లి, భార్య, కూతురు, బావ మరదులు, బంధువులు ఆయన రాకకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రమాదమేదీ తలపెట్టకుండా మావోయిస్టులు దత్తాను లాల్ ఘడ్ క్షేత్రంలో జర్నలిస్టులకు అప్పగించారు. తన ఇంటికి చేరుకోవడానికి ముందు దత్తా సమీపంలోని ఝాగ్రామ్ పోలీసు స్టేషనులో రిపోర్టు చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సంఘటనపై వివరించడానికి ఆయన శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పోలీసు నిఘా విభాగం అధికారులను కలుసుకుంటారు.
మరిన్ని వివరములు:
మావోయిస్టులు
నక్సలైట్లు
కోల్ కత్తా
Related news