న్యూఢిల్లీ: భారతీయులు ఎడతెగకుండా ఈమెయిళ్లు పంపిస్తూ తనను విసిగిస్తున్నారని నోబెల్ పురస్కార విజేత వెంకటరామన్ రామకృష్ణన్ అసహనం వ్యక్తం చేశారు. "భారత్ నుంచి అన్ని వర్గాల ప్రజలు నాకు ఈ-లేఖలు రాస్తున్నారు. మెయిల్ బాక్స్ నుంచి వాటిని తొలగించడానికి ఒకటి.. రెండు గంటలు పడుతోంది" అని చెప్పారు. సహచరుల నుంచి, తన పరిశోధనలను ప్రచురించే వివిధ పత్రికల నుంచి వచ్చే సమాచారాన్ని భారత్ నుంచి వచ్చే ఈమెయిళ్లు అడుగున పాతరేశాయని విసుక్కున్నారు.
"వీళ్లకు కొంచెం కూడా పట్టింపు ఉండదా? ఈ విజయాన్ని వారు గర్వంతో ఆస్వాదించొచ్చు సరే..మధ్యలో నన్ను విసిగించడం దేనికి?" అని ప్రశ్నించారు. "దశాబ్దాల పాటు నన్ను మరిచిపోయిన వారికి ఇప్పుడు ఉన్నట్లుండి నేను గుర్తొచ్చాను. అటువంటి వారి నుంచి కూడా ఈ-లేఖలు వస్తున్నాయి. నాతో మాట్లాడాలని కుతూహలం వ్యక్తం చేస్తున్నారు. నాకిదంతా వింతగా ఉంది" అన్నారు. తన గురించి కొన్ని అసత్యపు వివరాలు మీడియాలో ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని చిదంబరంలో తాను చదువుకున్నట్లు మీడియాలో చేసిన ప్రచారాన్ని ఖండించారు. "ఎవరో గోవిందరాజన్ అట..ఆయనతో పాటు మరికొందరు..అన్నామలై విశ్వవిద్యాలయంలో వారి వద్ద నేను చదువుకున్నానట. అదంతా అబద్ధం. అసలు నేను ఆ విశ్వవిద్యాలయానికి ఎప్పుడూ వెళ్లలేదు. మూడేళ్ల వయస్సులోనే నేను చిదంబరం నుంచి వెళ్లిపోయాను." అని స్పష్టం చేశారు. ప్రజలు తన పరిశోధన గురించి తెలుసుకుంటే, పుస్తకాలు చదివితే, సైన్సు పట్ల ఆసక్తి కనబరిస్తే తాను చాలా సంతోషిస్తానన్నారు. "నేను భారత సంతతి వ్యక్తినన్న విషయం ముఖ్యం కాదు. మనమందరం మనుషులం. జాతీయత అనేది పుట్టుకతో వచ్చే యాదృచ్ఛికాంశం మాత్రమే" అన్నారు.
భారత్లో ఒక ఉద్యోగానికి తన పేరును పరిశీలిస్తున్నారన్న వార్తలకు ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. భారత్లోని ప్రముఖ ప్రయోగశాల సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంచాలకుడిగా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు వచ్చిన వార్తలకు ఆయన స్పందిస్తూ "కేంబ్రిడ్జిలో ఇప్పుడు నేను కొలువు ఉంటున్న మాలిక్యులర్ బయాలజీ ప్రయోగశాల కంటే చక్కటి పని ప్రదేశం ఉంటుందని అనుకోను" అన్నారు.
మరిన్ని వివరములు:
న్యూఢిల్లీ
అమెరికా
చిదంబరం
Related news