హైదరాబాద్: ఖమ్మం సంఘటనపై ముఖ్యమంత్రి కె.రోశయ్య సోమవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ కొంత మంది కార్యకర్తలు ఖమ్మంలో సోనియా గాంధీ పోస్టరును చించేశారు. ఈ సంఘటన పార్టీలో తీవ్ర విభేదాలకు దారి తీసింది. ఖమ్మం సంఘటనపై రోశయ్య తన లేఖలో విచారం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో రెండు బస్సులను దగ్ధం చేయడంపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఖమ్మంలో పోస్టర్లను చించేయడం, రాజమండ్రిలో బస్సులను దగ్ధం చేయడం కొంత మంది దుష్టశక్తుల పని అని ఆయన అన్నారు. ఈ సంఘటనలపై పిసిసి చర్యలు చేపట్టిందని, ఖమ్మం సంఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుందని, వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని ఆయన వివరించారు. ఆ చర్యకు పాల్పడిన నలుగురు పార్టీ కార్యకర్తల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ సంఘటనను జగన్ కూడా ఖండించిన విషయాన్ని సోనియా దృష్టికి తెచ్చారు.