హైదరాబాద్: ఇష్టం ఉన్నవారు తనతో పనిచేయవచ్చునని, ఇష్టం లేనివారు వెళ్లిపోవచ్చునని ముఖ్యమంత్రి కె. రోశయ్య హెచ్చరించారు. కొద్ది రోజులుగా ఆయన స్వరం పెంచి జగన్ వర్గీయులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా మహిళా సంక్షేమ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన మంగళవారం ఆ హెచ్చరిక చేసి ఉంటారని భావిస్తున్నారు. తనను అధిష్ఠానం ముఖ్యమంత్రిగా నియమించిందని, తాను తన బాధ్యతను నెరవేరుస్తున్నానని, ఇష్టం ఉన్నవారు తనతో పని చేయవచ్చునని, ఇష్టం లేనివారు వెళ్లి పోవచ్చునని ఆయన అన్నారు.
రాష్ట్ర కాంగ్రెసులో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడ్ని చేయవద్దని, తండ్రి పోయిన దుఖ్కంలో ఉన్న జగన్ ను ఇలాంటి విషయాల్లోకి లాగవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. జగన్ కు ప్రత్యేక వర్గం ఉందని తాను భావించడం లేదని ఆయన చెప్పారు.