కడప: వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ కడప జడ్పీ పరిషత్ సమావేశాన్ని కార్యకర్తలు మంగళవారం అడ్డుకున్నారు. కార్యకర్తలకు జెడ్పీటీసీలు మద్దతు ఇచ్చారు. జగన్ ను సీఎం చేసేవరకూ జడ్పీ సమావేశాలు నిర్వహించవద్దంటూ కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. కడపై జిల్లాపై వైఎస్ కుటుంబానికి తిరుగులేని పట్టు ఉన్న విషయం తెలిసిందే. జగన్ ఈ జిల్లాలో అనే పరిశ్రమలను పెట్టించారు, అవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయితే ఈ జిల్లాలో నిరుద్యోగ సమస్య దాదాపుగా పరిష్కారమవుతుందని అంచనా. ఈ పరిశ్రమలు వేగంగా పూర్తి కావాలంటే జగన్ ముఖ్యమంత్రి అయితీరాలి. అందువల్ల కడప జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆందోళన బాట పట్టారు.
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. నిన్నగాక మొన్న ఖమ్మం పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ చిత్ర పటం చించిన సంఘటనపై ఆందోళన చెందిన అధిష్టానం తేరుకోకముందే.. అనంతపురం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనె ప్రమాదస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.