హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు గుదిబండగా మారాయి. ఎన్నికల్లో పాల్గొనాలా, లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడం ఆయనకు కొరకరాని కొయ్యగా మారింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కెసిఆర్ కు కట్టబెడుతూ పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయం చేసింది. ఇప్పుడు తేల్చాల్సిందే కెసిఆరే. దీంతో ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అనే విధంగా ఆయన పరిస్థితి తయారైందని అంటున్నారు.
హైదరాబాదులో తెరాసకు తగిన బలం లేదనే విషయం తెలిసిందే. గతంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గాల్లో గెలిచిన తెరాస ఇటీవలి ఎన్నికల్లో ఆ సీట్లను కూడా కోల్పోయింది. మహేశ్వరం శాసనసభా స్థానంలో రియల్టర్లు తెరాస అభ్యర్థిని తరిమి కొట్టారు కూడా. రియల్టర్లు తెరాసను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లింల్లోకి తెలంగాణ వాదం ఇంకలేదు. పైగా సెటిలర్ల ప్రభావం గ్రేటర్ హైదరాబాదు పరిధిలో బలంగానే ఉంది. దీంతో పోటీకి తెరాస వెనకాడుతోంది. పోలిట్ బ్యూరోలోని 95 శాతం మంది పోటీ వద్దని అభిప్రాయపడినట్లు కెసిఆర్ ఇంతకు ముందు చెప్పారు. దీంతో పోటీ నుంచి తెరాస తప్పుకోవడానికి సిద్ధమైనట్లే భావించారు.
తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని చెబుతూ వస్తున్న తెరాసకు గ్రేటర్ ఎన్నికల్లో తగిన స్థానాలు వస్తాయని చెప్పడం కష్టమే. ఈ స్థితిలోనే విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెరాసకు సవాళ్లు విసురుతున్నారు. పైగా హైదరాబాద్ ను తమదని చెప్పుకుంటూ పోటీ చేయకపోవడం వల్ల ఏ విధమైన నష్టం జరుగుతుంది, పోటీ చేసి గెలవక పోతే సంభవించే నష్టం ఏమిటి అనేది బేరీజు వేసుకోవడంలో కెసిఆర్ మునిగిపోయినట్లు చెబుతున్నారు. అయితే రెండు విధాల కూడా నష్టమేనని స్పష్టమైపోయినట్లే. అయితే ఏది తక్కువ నష్టమనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కెసిఆర్ కు తలకు మించిన భారంగానే మారాయి.
మరిన్ని వివరములు:
కె చంద్రశేఖర రావు
తెలంగాణ
గ్రేటర్ హైదరాబాద్
సంబంధిత వార్తలు